శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (09:41 IST)

వింగ్ కమాండర్ అభినందన్ శరీరంలో పాకిస్థాన్ 'స్పై బగ్'?

శత్రుదేశం పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న తర్వాత ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, న్యూఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన ఆస్పత్రిలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. 
 
అతని శరీరంలో ఏదైనా చిప్‌ను పాక్‌ ఆర్మీ చొప్పించిందా? అనే కోణంలో జరిపిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో ఎలాంటి 'స్పై బగ్' లేనట్లు నిర్ధారణ అయ్యిందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే.. అతను పారాచ్యూట్ ద్వారా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగినపుడు వెన్నుపూస కింది భాగంలో, స్థానిక ప్రజలు దాడి చేసినపుడు పక్కటెముకలకు గాయమైనట్టు వైద్యులు నిర్ధారించారు. సోమవారం కూడా మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
అంతేకాకుండా, పాకిస్థాన్‌కు యుద్ధ ఖైదీగా చిక్కాక అక్కడి సైన్యం ఏయే ప్రశ్నలు వేసింది? అభినందన్‌ వారికి ఏం చెప్పాడు అనే కోణంలో రక్షణ ఏజెన్సీల విచారణ కొనసాగుతోంది. మరోవైపు అభినందన్‌కు త్వరలో బెంగళూరులోని ఐఏఎంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయన వెన్నెముకకు దెబ్బ తగిలినందున.. తిరిగి ఫైటర్‌ జెట్లలో విధులు అప్పగించవచ్చా? లేదా? అనేది ఈ పరీక్షల్లో తేలనుంది. 
 
కాగా, కార్గిల్‌ యుద్ధం సమయంలో పాక్‌లో దిగిన ఫైటర్‌ పైలట్‌ కంభంపాటి సచికేతకు కూడా ఇదే తరహా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆయన్ను ఫైటర్‌ జెట్‌ విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పైలెట్‌గా పని చేస్తున్నారు.