శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:09 IST)

మద్యంతాగి డ్రైవింగ్ చేసిన ఆటోడ్రైవర్ .. రూ.47,500 అపరాధం

మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన ఆటో డ్రైవర్‌కు పోలీసులు ఏకంగా 47500 రూపాయల అపరాధం విధించారు. అంత మొత్తాన్ని చెల్లించలేను బాబోయ్ అంటూ ఆ ఆటో డ్రైవర్ బోరున విలపించాడు. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బుధవారం మధ్యాహ్నం నగరంలోని ఆచార్య విహార్ చక్‌లో పోలీసులు వాపనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ఆటోను ఆపి తనిఖీ చేయగా, అతనివద్ద వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు. పైగా, మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టు గుర్తించారు. 
 
దీంతో సాధారణ తప్పు కింద రూ.500, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.5 వేలు, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.10 వేలు, తాగి నడిపినందుకు రూ. 10 వేలు, పొల్యూషన్ నిబంధనను ఉల్లంఘించినందుకు రూ.10 వేలు, అనుమతి లేని వ్యక్తితో వాహనం నడిపిస్తున్నందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ పత్రాలు లేనందుకు రూ.5 వేలు, ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్నందుకు రూ.2 వేలు కలిపి మొత్తంగా రూ.47,500 వడ్డించారు.
 
జరిమానాను వెంటనే చంద్రశేఖర్‌పూర్‌లోని డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్‌లో చెల్లించాలని ఆదేశించారు. తాను తాగి ఉన్నానని అంగీకరించిన ఆటో డ్రైవర్ హరిబంధు కన్హర్.. అంత మొత్తాన్ని తాను చెల్లించలేనని, తన ఆటోను సీజ్ చేయాలని, లేదంటే తనను జైలుకు పంపాలని అధికారులను కోరాడు. 
 
ఆటోకు సంబంధించిన అన్ని పత్రాలు ఇంటి వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారమే జరిమానా విధించామని పేర్కొన్న అధికారులు, ఆటోను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.