మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (09:29 IST)

బెంబేలెత్తిస్తున్న కొత్త మోటార్ చట్టం.. స్కూటీ ఖరీదు రూ.15 వేలు.. ఫైను రూ.23 వేలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు కొత్త మోటారు వాహన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే వాహనదారులు బెంబేలత్తిపోయారు. ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని పోలీసులు ఎడాపెడా అపరాధం వసూలు చేశారు. స్కూటీ ఖరీదు రూ.15 వేలు అయితే...ఆ స్కూటీ వాహనదారుడు నుంచి పోలీసులు వసూలు చేసిన అపరాధ రుసుం రూ.23 వేలు. దీంతో ఆ వాహనదారుడు లబోదిబోమంటున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లో ఓ స్కూటర్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.23 వేల జరిమానా విధించారు. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తన వద్ద పెట్టుకోకపోవడమే ఆ వాహనదారుడు చేసిన తప్పు. దినేశ్ మదన్ అనే వ్యక్తి హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడుపుతుండటంతో ఆపిన పోలీసులు మిగతా డాక్యుమెంట్లు చూపించాలని కోరారు. కానీ ఆయన వద్ద లైసెన్సు లేదు, వాహన రిజిస్ట్రేషన్ పత్రం లేదు, థర్డ్ పార్టీ బీమా పత్రం లేదు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు, హెల్మెట్ ధరించలేదు. దీంతో భారీ జరిమానా విధించారు.
 
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేనందుకు రూ.5 వేలు, ఇన్సూరెన్స్ లేనందుకు రూ.2 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనందుకు రూ.10 వేలు, హెల్మెట్ లేకుండా నడిపినందుకు రూ.1,000 కలిపి మొత్తం రూ.23 వేల జరిమానా విధించడంతో మదన్ విస్తుపోయాడు. తన స్కూటీ రూ.15 వేల ఖరీదు కూడా చేయదని, కానీ రూ. 23 వేల జరిమానా విధించారని వాపోయాడు. మరోమారు ఇలాంటి తప్పు చేయబోనని, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ దగ్గరపెట్టుకుంటానని మదన్ వాపోయాడు.