శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (10:55 IST)

తమిళ బీజేపీ సారథిగా కబాలీ?!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బీజేపీలో చేరనున్నారా? ఆయన తమిళనాడు బీజేపీ శాఖకు అధ్యక్షుడు కానున్నారా? ఆయన ప్రారంభించిన రజినీ అభిమానుల సంఘాన్ని కూడా అందులో విలీనం చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ప్రచారంలో ఉంది. 
 
తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలుగా ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా నియమించారు. దీంతో తమిళనాడు బీజేపీ శాఖకు కొత్త వ్యక్తిని అధ్యక్షురాలిగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు కొత్త చీఫ్‌గా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌ను నియమిస్తారంటూ, రాష్ట్రంలో సరికొత్త ప్రచారం మొదలైంది. 
 
ఇటీవలి కాలంలో బీజేపీకి దగ్గరైనట్టు కనిపిస్తున్న రజనీకాంత్, ఆ మధ్య నరేంద్ర మోడీ, అమిత్ షాలకు కృష్ణార్జునులుగా అభివర్ణించారు కూడా. ఆర్టికల్ 370 రద్దును రజనీకాంత్ సమర్థించారు. పైగా, రజినీకాంత్‌కు ఆర్సెస్, బీజేపీ అగ్రనేతలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఆధ్యాత్మిక రాజకీయాలకు శ్రీకారం చుడుతానంటూ ఆయన ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఆ పార్టీ సీనియర్ నేతలైన హెచ్.రాజా, పార్థసారథి, పొన్ రాధాకృష్ణన్‌లు కూడా ఉన్నారు. కానీ, బీజేపీ అధిష్టానం మాత్రం, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఐదు రోజుల పాటు చెన్నైలోనే గడపనున్న తమిళిసై, వచ్చే వారంలో హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోగానే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందనే ప్రచారం సాగుతోంది.