1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (08:44 IST)

బడ్డీకొట్టు మహిళను గొంతుకోసి చంపేశాడో దుర్మార్గుడు

దేశరాజధాని ఢిల్లీ నగరంలో కూరగాయల బండి (బడ్డీకొట్టు) పెట్టుకొని జీవించే ఒక మహిళను గొంతుకోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం ద్వారకా ప్రాంతంలో జరిగింది. తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది.
 
ఆ తర్వాత తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. ఈ హత్యోదంతం మొత్తం దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
అయితే అక్కడకు వెళ్లే సరికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని విభ (30)గా గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చావబాదారు. తాగిన మైకంలో విభ, ఆమె భర్తతో అతను గొడవపడ్డాడని, ఆ కోపంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు.
 
సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు... నిందితుడి కోసం వెళ్లగా పోలీసులను కూడా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని కాపాడిన పోలీసులు స్థానికంగా ఉన్న దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు విధులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు.