పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత
ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. అధిక వేడి, విపరీతమైన రద్దీ కారణంగా 600 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై పూరీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కిషోర్ శతపతి మాట్లాడుతూ, యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పాటు ఎండ, ఉక్కపోత, రద్దీ కారణంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. చాలా మంది వాంతులు, కళ్లు తిరిగి పడిపోవడం, చిన్నపాటి గాయాలు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన వివరించారు. వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
అస్వస్థతకుగురైన వారిలో చాలా మంది ప్రాథమిక చికిత్సలో కోలుకున్నారని, వారిని ఇళ్లకు పంపించేశామని డాక్టర్ కిషోర్ తెలిపారు. ప్రస్తుతం దాదాపు 700 మంది జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయని వెల్లడించారు. భక్తుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.