1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (21:23 IST)

పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం - మొగిలయ్య... షావుకారు జానకి...

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించింది. మొత్తం 128 మందికి ఈ అవార్డులను కేంద్రం ఇవ్వనుంది. భారత 73వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. వీరిలో మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌, సీనియర్ నటి షావుకారు జానకిలతో పాటు అనేక మంది ప్రముఖులు ఉన్నారు. 
 
ముఖ్యంగా, 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు. మొగిలయ్య ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్" చిత్రంలో ఓ పాటను పాడిన విషయం తెల్సిందే. 
 
ఈ యేడాది నలుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు ఇచ్చారు. వీరిలో దివంగత సైనికాధికారి బిపిన్ రావత్‌ కూడా ఉన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత కళ్యాణ్ సింగ్‌లు ఉన్నారు. వీరికి మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించారు. అలాగే, సాహితీవేత్త, విద్యారంగాలకు చెందిన రాధేశ్యాణ్ ఖేమ్కా, కళాకారిణి ప్రభా ఆత్రేలకు పద్మ విభూషణ్ ప్రకటించారు. 
 
ఈ యేడాది 17 మంది పద్మ విభూషణ్ ప్రకటించారు. వీరిలో భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు పద్మభూషణ్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలాలకు కూడా ఇదే పురస్కారాన్ని ఇచ్చారు. 
 
ఇక పద్మశ్రీ పురస్కారాల విషాయనికి వస్తే మొత్తం 107 మందికి ఈ అవార్డులు ఇచ్చారు. వీరిలో ఏపీకి చెందిన ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు, ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కళల విభాగంలో తెలంగాణాకు చెందిన పద్మారెడ్డిలు, కిన్నెర కళాకారుడు మొగిలయ్యలతో పాటు మరికొందరు ఉన్నారు. తమిళనాడు కోటా నుంచి ప్రముఖ నటి షావుకారు జానకి, ప్రముఖ వైద్య నిపుణుడైన డాక్టర్ వీరస్వామి శేషయ్యలకు కూడా పద్మశ్రీ పురస్కారాలు ఇచ్చారు.