పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)
ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకులను హతమార్చిన విషయం తెల్సిందే. దీంతో జమ్మూకాశ్మీర్తో పాటు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇపుడు కాశ్మీర్ లోయలో సైనిక బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అక్కడ విషాదకర వాతావరణం నెలకొన్నప్పటికీ మహారాష్ట్రకు చెందిన ఓ జంట మాత్రం పట్టుబట్టిమరీ అదే ప్రాంతంలో తమ వివాహ మహోత్సవాన్ని జరుపుకుంది. సుశాంత్, ప్రీతి అనే ఈ దంపతులు భయాన్ని వీడి పహల్గాంను సందర్శించి, ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే సందేశాన్ని పంపించారు.
ఇదే అంశంపై వారు స్పందిస్తూ, ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు కొంత ఆందోళనలో ఉన్నప్పటికీ, ఇక్కడ పరిస్థితులు మాత్రం సాధారణ స్థితికి వస్తున్నాయని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని దేశ ప్రజలకు తెలియజేయడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పహల్గాంలో జీవితం సాధారణంగానే సాగుతోంది. ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఉన్నారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలనే మేము ఇక్కడికి వచ్చాం అని వారు పేర్కొన్నారు.
కాశ్మీర్ లోయలోని అపురూపమైన ప్రకృతి సౌందర్యాన్ని, స్థానిక ప్రజలు స్నేహపూర్వక ఆతిథ్యాన్ని దేశ ప్రజలందరూ వచ్చి స్వయంగా అనుభవించాలని సుశాంత్, ప్రీతి పిలుపునిచ్చారు. ఉగ్రవాద ఘటనల వల్ల భయపడకుండా, ధైర్యంగా కాశ్మీర్ను సందర్శించి ఇక్కడి పర్యాటక రంగానికి చేయూత నివ్వాలని వారు కోరారు.