1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (10:53 IST)

ప్రధాని మోడీ ఓ పిరికిపంద... ప్రియాంకా గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ ఆరోపణలు గుప్పించారు. మోడీని ఓ పిరికిపందగా అభివర్ణించారు. ప్రధాని మోడీ చాలా పిరికివారని, కరోనా మహమ్మారి చెలరేగిపోతుంటే ఆయన మాత్రం ఏం చేయకుండా చేష్టలుడిగి చూస్తుండిపోయారని ఎద్దేవా చేశారు. 
 
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆయన అసమర్థత ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందంటూ వరుస ట్వీట్లు చేశారు. దేశ ప్రతిష్ఠను ప్రధాని మోడీ పూర్తి స్థాయిలో దిగజార్చారని ప్రియాంక ధ్వజమెత్తారు.
 
ప్రధాని మోడీకి ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యమని, ఆయనకు వాస్తవాలతో పనిలేదని, ప్రచారం ఉంటే చాలని అన్నారు. విపత్తును ఎదుర్కోవడంలో ఎవరు విఫలమయ్యారో ప్రధానిని ప్రజలు అడిగే సమయం వచ్చిందన్నారు. కాగా, విపత్తు వైఫల్యానికి ‘బాధ్యులెవరు?’ (జిమ్మేదార్ కౌన్) హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ప్రచారంలో భాగంగా పలు సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక గాంధీ పోస్టులు పెట్టారు.