గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:04 IST)

డిస్ లైక్‌లలో రికార్డు సృష్టించిన మన్ కీ బాత్ : కాంగ్రెస్ కుట్రేనంటున్న బీజేపీ

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్ కీ బాత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. మన్ కీ బాత్ అంటే.. ఆల్ ఇండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహించే కార్యక్రమం. ప్రతి నెలలో ఓ ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులోభాగంగా గత ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ 'మన్ కీ బాత్' ప్రసంగానికి రికార్డు స్థాయిలో డిస్ లైక్‌లు వచ్చాయి. 
 
ప్రధాని మోడీ వీడియోను బీజేపీ తన అధికారిక యూ ట్యూబ్ చానెల్‌లో పెట్టగా, 8.50 లక్షలకు పైగా డిస్ లైక్స్ నమోదయ్యాయి. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదని బీజేపీ ఆరోపణలు చేసినప్పటికీ, కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణకు కేంద్రం పూనుకోవడం, ఈ పరీక్షల గురించి మోడీ ప్రస్తావించక పోవడం యువతలో ఆగ్రహాన్ని పెంచి, దాన్ని ఇలా డిస్ లైక్‌ల రూపంలో చూపిందని తెలుస్తోంది.
 
ముఖ్యంగా, కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా, పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు, తమ అసంతృప్తిని ఇలా వ్యక్తం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
ఇక ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో అత్యధికం, పరీక్షలను వ్యతిరేకిస్తూ ఉన్నవే కావడం గమనార్హం. కాగా, నేటి నుంచి ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ, పరీక్షలను సజావుగా ముగించేలా చూసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.