శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (13:59 IST)

బీజేపీ దృష్టిలో మణిపూర్ భారత్‌లో అంతర్భాగం కాదు.. భరతమాతను చంపేసింది.. రాహుల్ ధ్వజం

rahulgandhi
భారతీయ జనతా పార్టీ దృష్టిలో మణిపూర్ భారత్‌లో అంతర్భాగం కాదని, ఆ రాష్ట్రంలో భరతమాతను చంపేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ పాలకులు నిట్ట నిలువునా రెండుగా చీల్చేశారన్నారు. కేంద్రం తలచకుంటే భారత సైన్యంతో మణిపూర్‌లో శాంతి నెలకొనేలా చేయడం పెద్ద కష్టమైన పనికాదన్నారు. కానీ, అక్కడ శాంతి నెలకొల్పడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదని, మణిపూర్ తగలబడిపోవడమే బీజేపీ పాలకులకు కావాలన్నారు. 
 
విపక్షాలన్నీ కలిసి కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, ఇటీవల తాను చేసిన భారత్ జోడో యాత్రను సభలో ప్రస్తావించారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని తనను చాలామంది అడిగారన్నారు. భారత్ జోడో యాత్ర వెనక తన లక్ష్యం ఏంటని అడిగారని చెప్పారు. భారత దేశాన్ని చూసేందుకు, ప్రజలను కలిసేందుకు, దేశాన్ని, ప్రజలను మరింతగా అర్థం చేసుకునేందుకే యాత్ర చేస్తున్నానని తాను వారికి జవాబిచ్చినట్లు చెప్పారు. 
 
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణం మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండేనని రాహుల్ గాంధీ లోక్‌సభలో స్పష్టం చేశారు. మణిపూర్ కూడా భారత్‌లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. అక్కడి ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చాలని సూచించారు. ఇటీవల తాను మణిపూర్ వెళ్లానని రాహుల్ చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకూ వెళ్లలేదని, ఎందుకంటే వారి దృష్టిలో మణిపూర్ మన దేశంలో భాగం కాదని ఆరోపించారు. మణిపూర్‌ను కేంద్ర ప్రభుత్వం రెండుగా చీల్చిందని, అక్కడ భారత మాతను చంపేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 
 
మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల క్యాంపులో మహిళలను, చిన్నారులను కలిశానని రాహుల్ గాంధీ చెప్పారు. ఓ మహిళ తనతో మాట్లాడుతూ.. తను ఎదుర్కొన్న దారుణమైన కష్టాలను చెప్పుకుందని వివరించారు. తనకు ఒక్కడే కొడుకని, ఆ కొడుకును తన కళ్ల ముందే కాల్చి చంపారని చెబుతూ కన్నీటి పర్యంతమైందని రాహుల్ చెప్పారు. 
 
రాత్రంతా తన కొడుకు మృతదేహం వద్దే ఉన్నానని, తెల్లవారాక భయంతో కట్టుబట్టలతోనే అక్కడి నుంచి వచ్చేశానని చెప్పిందన్నారు. తన దగ్గర ఇప్పుడు కేవలం ఈ బట్టలు మాత్రమే మిగిలాయని, సర్వం కోల్పోయానని తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే.. భారత సైన్యం రంగంలోకి దిగితే మణిపూర్ లో శాంతిని నెలకొల్పడం కేవలం ఒక్కరోజులోనే సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్‌లో శాంతి నెలకొనడం ఇష్టంలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.