శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (14:20 IST)

రాహుల్‌కు ఇంకా పెళ్ళికాలేదు.. అమ్మాయిలూ ఆయన ముందు వంగకండి...

కేరళ రాష్ట్రానికి చెందిన మాజీ స్వంతంత్ర ఎంపీ జాయ్స్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. సీపీఎం అభ్యర్థి, మంత్రి ఎంఎం మణికి మద్దుతుగా నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీ పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేశారు. రాహుల్‌కు ఇంకా పెళ్లి కాలేదన్న విషయాన్ని అమ్మాయిలు గుర్తుపెట్టుకుని.. ఆయన ముందు వంగరాదని సూచించారు. 
 
‘‘రాహుల్ గాంధీ ఎప్పుడూ అమ్మాయిల కాలేజీలకే వెళుతుంటారు. అక్కడికి పోయి వంగాల్సిందిగా అమ్మాయిలకు చెబుతుంటారు. అమ్మాయిలూ.. దయచేసి రాహుల్ ముందు వంగకండి. ఆయన ముందు అసలు నిలబడకండి. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు’’ అంటూ ఇడుక్కీ మాజీ ఎంపీ అయిన ఆయన వ్యాఖ్యానించారు.
 
జార్జ్ మాటలకు పక్కనే ఉన్న మంత్రి ఎంఎం మణి నవ్వుతూ కనిపించారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో జార్జ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. జార్జ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. కేరళలో సీపీఎంకు ఓటమి భయం పట్టుకుందని అందుకే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుందంటూ మండిపడింది.