శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (19:25 IST)

మోదీ - అమిత్ షాల వద్ద మోకరిల్లాల్సిన అగత్యం ఏంటి : రాహుల్ గాంధీ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎడప్పాడిని కేంద్రానికి దాసోహమయ్యారని ఆరోపించారు. 
 
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం చెన్నై, సేలం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్ వంటి వ్యక్తుల కాళ్లు తాకడానికి ఏ తమిళుడూ ఇష్టపడడని, కానీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వారి ముందు మోకరిల్లాల్సి వస్తోందన్నారు. 
 
నిజానికి పళనిస్వామికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆర్ఎస్ఎస్, అమిత్ షాలు సీబీఐ, ఈడీలను ఉసిగొలిపి తమ కాళ్ల వద్దకు తెచ్చుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలోని సేలంలో డీఎంకే-కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు రాహుల్ హాజరై ప్రసంగించారు.
 
‘‘ముఖ్యమంత్రి పళనిస్వామి అమిత్ షా, మోహన్ భాగవత్‌లకు మోకరిల్లారు. ఏ తమిళుడూ వారి కాళ్లు తాకాలని అనుకోడు. పళనిస్వామికి కూడా వారికి లొంగిపోవడం ఇష్టం లేదు. కానీ ఆయన అవినీతి చేయడం వల్ల వారి ముందు లొంగిపోవాల్సిన గత్యంతరం వచ్చింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్, అమిత్ షాల వద్ద సీబీఐ, ఈడీ ఉన్నాయి. వాటికి భయపడే వారి ముందు ముఖ్యమంత్రి మోకరిల్లారు’’ అని రాహుల్ విమర్శలు గుప్పించారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘స్టాలిన్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. నేను దీనికి గ్యారెంటీ ఇస్తున్నాను. ఇది లాంఛనమే అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఉంది. అయితే దీన్ని అంత సులువుగా తీసుకోకూడదు. పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే, ఆర్ఎస్ఎస్, బీజేపీల వద్ద అపరిమితమైన డబ్బు ఉంది. ముందు వారిని తమిళనాడు నుంచి తరిమికొడదాం, ఆ తర్వాత ఢిల్లీ నుంచి సాగనంపుదాం’’ అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.