1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (12:23 IST)

తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ - రజనీ రూ.కోటి

కరోనా వైరస్ బాధిత రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అత్యధిక కేసులు నమోదతువున్న రాష్ట్రంగా ఉంది. అయితే, కరోనా రోగులకు వైద్య సేవల కోసం భారీగా ఖర్చు చేయాల్సివస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ఖజానాపై భారీగా భారపడుతోంది. దీంతో ప్రజలు తమకు తోచినవిధంగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ పిలుపునిచ్చారు. 
 
ఆయన పిలుపునకు స్పందించిన అనేక మంది తమకు చేతనైంత సాయం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సినీ ప్రముఖులు విరాళాలు అందచేశారు. తొలుత హీరో సూర్య కుటుంబం కోటి రూపాయల విరాళం ఇచ్చింది. అలాగే, హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా రూ.25 లక్షలు ఇచ్చారు. 
 
ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసి చెక్ అందించారు. గురువారం ప్రముఖ హీరో అజిత్ 25 లక్షల రూపాయలు ఇవ్వగా సూపర్ స్టార్ రజనీకాంత్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ నిధిని ఆయన కుమార్తె సౌందర్య అందజేశారు.
 
ఇదిలావుంటే, కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కూడా అమల్లో ఉండగా, మరికొన్ని చోట్ల కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు, ఆక్సిజన్, మందులు, బెడ్‌ల కొరత వేధిస్తోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు మురుగదాస్ తన వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రముఖ నటుడు సూర్య, ఆయన సోదరుడు కార్తి కలసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇప్పటికే కోటి రూపాయల విరాళం అందించారు.