గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు
శత్రుదేశం పాకిస్థాన్కు గూఢచర్యంతో పాటు భారత సిమ్ కార్డును పాక్ పౌరుడుకు పంపించిన కేసులో రాజస్థాన్ రాష్ట్రంలోని మేవాట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్లో శిక్షణ పొందిన ఈ ఐఎస్ఐ ఏజెంట్ పేరు కాసిం. కాసిం రెండుసార్లు పాకిస్థాన్ను సందర్శించి ఐఎస్ఐ వద్ద గూఢచారిగా శిక్షణ పొందారు. ఆ తర్వాత స్వేదేశానికి వచ్చి గూఢచర్యానికి పాల్పడటమే కాకుండా, భారత్ సిమ్ కార్డులను పాకిస్థాన్కు చేరవేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కాసింను గురువారం అరెస్టు చేసింది. కాసింను రాజస్థాన్ రాష్ట్రంలోని మేవాట్లోని డీగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాసిం పోలీసు రిమాండ్లో ఉన్నాడు.
పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. కాసిం రెండుసార్లు పాకిస్థాన్ను సందర్శించాడు. ఒకసారి 2024 ఆగస్టులో, అలాగే మళ్లీ 2025 మార్చిలో పాక్ వెళ్లాడు. మొత్తం 90 రోజులు అక్కడే ఉన్నాడు. ఈ సందర్శనలో సమయంలో అతను ఐఎస్ఐ హ్యాండ్లర్లు, సీనియర్ ఆపరేటివ్ల వద్ద గూఢచర్య శిక్షణ పొందాడు.
దర్యాప్తులో కాసిం భారత సిమ్ కార్డులను పాకిస్థాన్కు పంపుతున్నాడని, ఆ తర్వాత పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పీఐవో) భారతీయులను వాట్సాప్ ద్వారా సంప్రదించి సున్నితమైన సైనిక, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేవారని తేలింది. అలాగే కాసిం భారత్లో అనేక మందిని తీవ్రవాదం వైపు మళ్లించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అతనికి విస్తృతమైన నెట్వర్గ్ ఉందని అధికారులు గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు తర్వాత మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు లేకపోలేదు.