శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:16 IST)

నెలసరిలో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు... ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారంటే...

తమవద్దకు వచ్చే విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పి.. విద్యాబుద్ధులు నేర్పి.. సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రిన్సిపాల్... ఏకంగా విద్యార్థినులు పరువు మంటగలిపేలా ప్రవర్తించారు. ఎవరు నెలసరిలో ఉన్నారో తెలుసుకునేందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్.. బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి పరీక్షించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన వైరల్ కావడంతో పూర్తిస్థాయి విచారణకు ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో ఓ మహిళా కాలేజీవుంది. కళాశాలలోని వంట గదిలో కొన్ని వాడిన శానిటరీ ప్యాడ్లు కనిపించాయి. వీటిని గమనించిన హాస్టల్ వార్డెన్.. విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ మాట వినగానే ఆమెకు కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయారు. 
 
ఆ కాలేజీ నిబంధన మేరకు నెలసరిలో ఉన్న విద్యార్థినులు మిగతా స్టూడెంట్లతో కలవకూడదు. వంట గదిలోకిగానీ దేవుడి గదిలోకి కానీ ప్రవేశించకూడదు. అలాంటిది వంటగదిలో వాడేసిన శానిటరీ ప్యాడ్లు కనిపించడం ప్రిన్సిపాల్‌కు ఆగ్రహం కలిగించింది. 
 
పైగా, కాలేజీ నిబంధనను ఉల్లంఘించిన విద్యార్థిని ఎవరో గుర్తించాలని ఆమె భావించి, తొలుత తప్పు చేసింది ఎవరో చెప్పాలంటూ కోరింది. దీంతో ఇద్దరు విద్యార్థినులు ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఆ ప్రిన్సిపాల్ ఆగ్రహం చల్లారలేదు. 
 
అంతే, 68 మంది విద్యార్థినులను ఒక్కొక్కరిగా పరీక్షించారు. ఒక్కో విద్యార్థినిని బాత్రూమ్‌కు తీసుకెళ్లిన మహిళా టీచర్లు వారి దుస్తులు తొలగించి మరీ పరీక్షించారు. ప్రిన్సిపాల్ ఎదురుగానే వారిని పరీక్షించారు. దీంతో బాధిత విద్యార్థినులు సిగ్గుతో కుంగిపోయారు.