1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 మే 2025 (18:11 IST)

ఆపరేషన్ సిందూర్ పూర్తికాలేదు ... జస్ట్ విరామం మాత్రమే : రాజ్‌నాథ్ సింగ్

ins vikrant - rajnath
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పూర్తిగా ముగియలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చామని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నౌకాదళం ప్రదర్శించిన అద్భుతమైన సముద్ర సంసిద్ధతను ఆయన కొనియాడారు. పనిలోపనిగా శత్రుదేశం పాకిస్థాన్‌కు ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. 
 
ఈ అపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ, శక్తిమంతమైన దాడులతో భారత్‌ దూసుకురావడంతో సైనిక చర్యలను ఆపాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను అభ్యర్థించిందని, మనం మన నిబంధనలకు అనుగుణంగానే ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. 
 
ఆ సమయంలో నౌకాదళం పాత్ర ప్రశంసనీయమన్నారు. పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేయగా, అదే సమయంలో సముద్రంలో మన నౌకాదళం చూపిన సంసిద్ధత పాకిస్థాన్ నౌకాదళాన్ని కనీసం ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.