1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జనవరి 2024 (15:24 IST)

కొలువుదీరిన బాల రాముడు - నీలమేఘశ్యాముడి విశేషాలు...

lordrama
అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. దరశరథ నాథుడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, ప్రధాన యజమానిగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ క్రతువును పూర్తిచేశారు. 
 
కార్యక్రమం పూర్తయిన తర్వాత బాల రాముడి సుందర రూపాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు బాల రాముడిని కనులారా దర్శించుకున్నారు. బాల రాముడి విగ్రహానికి సంబంధించిన కొన్ని విశేషాలు..
 
నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ ఇది. నీలమేఘశ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు. బాల రాముడి విగ్రహాన్ని స్వర్ణ, వజ్రాభరణాలతో అలంకరించారు. రాజకుటుంబ ఠీవీని ప్రదర్శించేలా ఆభరణాలతో అలంకరించారు.
 
రాముడిని ఐదేళ్ల బాలుడి రూపానికి తగ్గట్లుగా, ఆ వయసులో కనిపించే అమాయకత్వం ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు. ఐదేళ్ల బాలుడి ఎత్తుకు కాస్త అటూఇటుగా 51 ఇంచుల విగ్రహం ఇది.
 
స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారు చేసి బాల రాముడి చేతిలో అలంకరించారు. రాముడు ఆజానుభాహుడని రామాయణంలో వర్ణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకగా బాల రాముడి చేతులను పొడవుగా, మోకాళ్ల వరకు చేరేంత పొడవుతో తీర్చిదిద్దారు. ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు.
 
రామాయణంలో శ్రీరాముడి వర్ణనను దృష్టిలో ఉంచుకుని ఈ విగ్రహానికి రూపమిచ్చారు. అందుకే బాల రాముడి కళ్లు పద్మాలను పోలినట్లు కనిపిస్తున్నాయి. ఈ బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మలిచారు.