రూ.2000 నోట్లు కూడా రద్దవుతాయా? జూన్ వరకు కష్టాలు తప్పవా? మోడీ పక్కా ప్లాన్
దేశాన్ని నగదు రహిత దేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాటు నల్ల కుబేరుల ఆట పట్టించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్లను రద్దు చేసిన సర్కారు వ్యూ
దేశాన్ని నగదు రహిత దేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాటు నల్ల కుబేరుల ఆట పట్టించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్లను రద్దు చేసిన సర్కారు వ్యూహం వేరేలా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త రూ.2 వేల నోట్లను కూడా వచ్చే జూన్లో రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
నిజానికి పెద్ద నోట్ల రద్దుకు, రూ.2వేల నోటుకు ఎటువంటి సంబంధం లేదని, రూ.2వేల నోట్లు ప్రవేశపెట్టాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. రూ.500 నోటు కంటే ముందే మార్కెట్లోకి రూ.2 వేల నోటు రావడానికి ఇదే కారణమని సమాచారం. నిజానికి 4 ప్రింటింగ్ ప్రెస్లు ఉంటే ఒక్కదాంట్లోనే రూ.2 వేల నోట్లను ప్రింట్ చేస్తున్నారట. ఇంకా దేశాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా రూ. 500 నోట్లను పరిమితంగా ముద్రిస్తున్నారని తెలిసింది.
కాగా, ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత నల్లకుబేరులు తమ వద్ద ఉన్న సొమ్మును రూ.2 వేల నోట్ల రూపంలో మార్చుకున్నారు. వచ్చే జూన్లో మళ్లీ ప్రభుత్వం రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటే వారు మళ్లీ రూ.500 నోట్లలోకి మార్చేసుకుంటారు. ఇలా చేసుకుంటూ పోతే నల్లధనం ఎప్పటికీ బయటకు రాదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది. అందుకే నోట్లను ప్రింట్ చేయడంలో పరిమితం పాటిస్తున్నారు.
రెండువేల రూపాయల నోటును రద్దు చేసిన తర్వాతే పూర్తిస్థాయిలో రూ.500 నోటును విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నోట్ల కొరతను తీర్చాలంటే మార్కెట్లోకి ఏకంగా రూ.8.3 లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం 1660 కోట్ల నోట్లను ముద్రించాలి. రూ.500 నోట్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది.
జూన్లో రూ.2వేల నోటును రద్దు చేసే నాటికి రూ.500 నోట్ల ముద్రణ పూర్తవుతుంది. మరోవైపు రూ.1000 నోట్లును తిరిగి తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం ప్రజల కష్టాలు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. తద్వారా నగదు రహిత లావాదేవీలు కూడా పెరిగిపోతాయని కేంద్రం యోచిస్తోంది.