1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (13:21 IST)

సనాతన ధర్మంపై ఎవరూ కామెంట్స్ చేయొద్దు : సీఎం ఎంకే స్టాలిన్

mk stalin
సనాతన ధర్మపై తన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందూ సంస్థల నేతలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి ఉదయనిధిపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఎం స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంపై చర్చకు దూరంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
'సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ఒక కేంద్రమంత్రి ప్రతి రోజూ సనాతన ధర్మంపై మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్‌లో మనం పడిపోకూడదు' అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, హిందువులు అనుసరించే సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా, ఎయిడ్స్ వ్యాధులతో పోలిస్తూ, దీన్ని సమాజం నుంచి నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రుల నుంచి, ఎంతో మంది తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యల ద్వారా ఉదయనిధి దేశవ్యాప్త చర్చకు తెరతీశారు.