1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (16:21 IST)

సైనిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు పూర్తి

గాల్వన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి. ప్రోటోకాల్‌ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.

సంతోష్‌ మిలటరీకి చేసిన సేవలకు గుర్తుగా  అధికారులు సంతోష్‌ యునిఫామ్‌, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. సంతోష్‌బాబు పార్థివ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం సంప్రదాయం ప్రకారం సంతోష్‌ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు.

కల్నల్ సంతోష్‌ అంత్యక్రియలకు హాజరైన వారిలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు సంతోష్ పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు.