1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: గురువారం, 7 మార్చి 2019 (19:24 IST)

"సర్కార్" సినిమా బాటలో కేంద్ర ఎన్నికల సంఘం...

గత ఏడాది తమిళ, తెలుగు భాషలలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయికగా నటించారు. ఈ సినిమా అనేక వివాదాలను కూడా తెచ్చిపెట్టింది. 
 
తమిళనాడులోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సీన్లు ఉన్నాయని రచ్చ జరగడంతో పాటుగా డైరెక్టర్ మురుగదాస్ మీద కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ప్రతినాయిక పాత్ర పేరు కోమలవల్లి, ఇది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కావడంతో మరో వివాదం రాజుకుంది.
 
ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం ప్రజలకు తెలిసేలా చేసాడు మురుగదాస్. అదే 49పి సెక్షన్. సర్కార్ సినిమాలో హీరో విజయ్ ఓటును ఎవరో దొంగ ఓటు వేస్తారు. తన ఓటును ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్న హీరో కోర్టులో కేసు వేసి, 49పి ద్వారా తిరిగి తెచ్చుకుంటాడు. 
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరచడం కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా ఈ 49పి సెక్షన్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ విషయం గురించి మురుగదాస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.