మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (08:39 IST)

ఐటీ తదుపరి టార్గెట్ శశికళ!... ఏ పదవి చేపట్టినా సరే ఐటీ/ఈడీ దాడులు తప్పవా?

ఆదాయపన్ను శాఖ అధికారుల తదుపరి టార్గెట్‌గా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ మారినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఏ పదవి చేపట్టినా సరే ఆమెతో ఆమె బంధువుల ఇళ్ళపై దాడులతో విరుచుకుపడాల

ఆదాయపన్ను శాఖ అధికారుల తదుపరి టార్గెట్‌గా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ మారినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఏ పదవి చేపట్టినా సరే ఆమెతో ఆమె బంధువుల ఇళ్ళపై దాడులతో విరుచుకుపడాలని ఐటీ, ఈడీ అధికారులకు ఆదేశాలు వచ్చాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
వాస్తవానికి మొన్నటికి మొన్న... రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ సారథిగా ఉన్న చీఫ్‌ సెక్రటరీ పి. రామ్మోహన్‌ రావు ఇంటిపైనే ఐటీ దాడులు జరిగాయి. ఇపుడు తమిళనాడులో రాజకీయంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న వారిపైనా ఐటీ/ఈడీ గురి పెట్టవచ్చుననే ప్రచారం సాగుతోంది. అది కూడా... సాక్షాత్తూ చిన్నమ్మ శశికళ కొలువైన పొయెస్‌ గార్డెన్ బంగళాలోనే ఐటీ అధికారులు అడుగుపెట్టే అవకాశాలున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
జయలలిత మరణం తర్వాత... ఇప్పటిదాకా తమిళనాడులో ఎనిమిది మంది రాజకీయ, అధికార ప్రముఖులపై ఐటీ సోదాలు జరిగాయి. రెండు రోజుల క్రితం పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర శాఖల సిబ్బందిని చెన్నైకి రప్పించారు. కేంద్ర బలగాలను కూడా అదే స్థాయిలో మోహరించారు. ఈ నేపథ్యంలో... ‘ప్రముఖులు’ లక్ష్యంగా ఐటీ సోదాలు జరిగే అవకాశమునట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
ఇక... పార్టీ పదవి, ముఖ్యమంత్రి పదవిలో ఏది తీసుకున్నా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ‘ఢిల్లీ’ నుంచి శశికళకు హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, శశికళకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలే ఆమె భవిష్యతను నిర్ణయిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.