1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (10:14 IST)

బెంగుళూరు ఎయిర్‌పోర్టులో పేలుడు ... ఆరుగురికి గాయాలు

సిలికాన్ వ్యాలీ సిటిగా పేరొందిన బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అరుగురికి గాయాలయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ రోడ్డు మార్కింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
ఎయిర్‌పోర్టులోని కార్గో కాంప్లెక్స్‌ ముందు భాగంలో రెండవ టెర్మినల్‌ కోసం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. తెల్లవారుజామున కార్మికులు రోడ్డుకు ఇరువైపులా యంత్రం సహాయంతో తెల్లరంగు మార్కింగ్‌లు, జీబ్రా లైన్లు పూస్తున్నారు. తెల్లరంగు తయారీ కోసం సిలిండర్‌లో రసాయనాలు వేసి వేడి చేస్తుండగా సిలిండర్‌ పేలింది.
 
ఆ మంటలు పక్కనే నిల్వ ఉంచిన రంగుడబ్బాలకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న కార్మికులకు మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో అవినాశ్, సిరాజ్, ప్రశాంత్, గౌతమ్, అజయ్‌కుమార్, నాగేశ్‌రావ్‌ అనే ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై విమానాశ్రయ వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు.