శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (22:13 IST)

సోనూసూద్ కొత్త అవతారం.. బత్తాయి జ్యూస్ ఫ్రీ అంటూ..?

Sonusood
కరోనా కాలంలో పేదల పాలిట ఆపద్భాంధవుడుగా నిలిచాడు సోనూసూద్. పేదలకు ప్రస్తుతం సాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా సోనూసూద్ కొద్దిరోజుల నుంచి కొత్త అవతారం ఎత్తాడు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్నాడు. 
 
సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం నుంచి పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం ప్రారంభించాడు. 'సోనూసూద్ పంజాబీ ధాబా.. ఇక్కడ దాల్.. రోటీ ఉచితమే'' అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.
 
ఆ తర్వాత రిక్షా మీద గడ్డి తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి కనిపించాడు. వెంటనే కారు దిగి స్వయంగా తనే రిక్షా తొక్కుకుంటూ వెళ్లాడు సోనూసూద్. ఇలా రోజుకొక చిరు వ్యాపారులకు సోనూసూద్‌ అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో సోనూ కొత్త అవతారం ఎత్తాడు. ఈసారి జ్యూస్‌ షాప్‌ ఓనర్‌గా మారిపోయాడు. హైదరాబాద్‌లో సందడి చేశాడు.
 
బంజారాహిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జ్యూస్ షాపుకి వెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. ఆ షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడాడు. ఇక్కడ బత్తాయి జ్యూస్‌ ఫ్రీ అంటూ స్వయంగా జ్యూస్‌ తయారు చేసి అమ్మాడు. 
 
కొద్దిసేపు అక్కడే ఉండి చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరాడు. దానికి చెందిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఇలా తనదైన స్టైల్‌లో చిరు వ్యాపారులకు సోనూ మద్దతిస్తుండటంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నువ్వు దేవుడు సామీ అని అంతా పొగొడుతున్నారు.