శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2024 (13:53 IST)

స్పోర్ట్స్ ఈవెంట్‌ అని చెప్పి బాలికపై అత్యాచారం చేసిన టీచర్, మృతి చెందిన బాధితురాలు

rape
ఒకవైపు కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో 14 ఏళ్ల బాలికపై స్పోర్ట్స్ టీచర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాధితురాలు సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలో నివాసం ఉంటోంది. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో గత ఇరవై రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం అర్థరాత్రి మరణించింది.
 
బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది డిశెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెను పిలిచాడు. ఈవెంట్ ముగిసిన అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమె బెదిరించాడు. దాంతో భయపడిన బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఎవరికీ చెప్పలేదు. ఐతే ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆమె అనారోగ్యానికి కారణం ఏమిటో తెలియని ఆమె పేరెంట్స్ ఆమెను ఛత్తీస్‌గడ్ లోని బంధువుల వద్దకు పంపగా అక్కడ ఆమెకు చికిత్స చేసారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిలో తేడా లేదు. దీంతో బాధితురాలు మౌనం వీడి జరిగిన విషయాన్ని అత్తకు చెప్పేసింది.
 
జరిగిన విషయం బయటకు పొక్కకుండా వుండేందుకు కీచక ఉపాధ్యాయుడు, కుటుంబంలోని కొందరికి రూ. 30,000 ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఐతే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జూలై 10న పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.