1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (18:45 IST)

నీ అందమైన ముఖంపై యాసిడ్ పోస్తా, ముంబై వీధుల్లో ఎలా తిరుగుతావో చూస్తాం

సామాన్య మహిళల నుంచి సెలెబ్రిటీల వరకు వేధింపులు తప్పట్లేదు. మహిళలపై దేశంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా సినీ నటి, రాజకీయ నేత నవనీత్ కౌర్ కూడా వేధింపులకు గురయ్యారు. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ లోక్‌సభ లాబీల్లోనే బెదిరించినట్లు పేర్కొన్నారు.
 
''మహారాష్ట్రలో నువ్వు ఎలా తిరుగుతావో చూస్తా.. నిన్ను జైలులో పెట్టిస్తామని.. నీ అందమైన ముఖంపై యాసిడ్ పోస్తా"మంటూ నవనీత్ కౌర్ తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులకు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశానన్నారు. శివసేన తరుపున బెదిరింపు లేఖలు వస్తున్నాయని చెప్పానని.. లోక్‌సభలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే గురించి మాట్లాడితే... "గర్వంతో ప్రవర్తిస్తున్న కారణంగా నీ అందమైన ముఖంపై యాసిడ్ పోస్తాం... దాంతో ఇక ఎక్కడికీ తిరగలేవు..." అంటూ శివసేన పేరుతో వచ్చిన లేఖల గురించి చెప్పినట్లు వెల్లడించారు.
 
కాగా.. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న అంబానీ ఇంటి వద్ద బాంబు కలకలం కేసుపై లోక్‌సభలో నవనీత్ కౌర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ హోంమంత్రిపై చేసిన అవినీతి ఆరోపణలను ఆమె సభలో ప్రస్తావించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఉద్దవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ నవనీత్ కౌర్ ఆరోపణలను ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. 
 
నవనీత్ బాడీ లాంగ్వేజ్,ఆమె మాటలు ఏమాత్రం సరికాదన్నారు. అంతేగాకుండా.. ఆమెను తానెందుకు బెదిరిస్తాను. ఒకవేళ ఆ సమీపంలో ఎవరైనా వుండివుంటే తాను బెదిరించినట్లు చెప్పేవారు కాదా.. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని అరవింద్ సావంత్ చెప్పారు. జీవితంలో ఎవరినీ బెదిరించలేదని.. అలాంటిది ఓ మహిళను తాను బెదిరించడం ఏమిటి? కేవలం పబ్లిసిటీ కోసమే నవనీత్ కౌర్ ఈ ఆరోపణలు చేస్తున్నారని సావంత్ పేర్కొన్నారు.