Hockey: హాకీ ట్రైనీపై కోచ్తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో 15 ఏళ్ల హాకీ ట్రైనీపై అత్యాచారం కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జూలై 3న సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా తన కోచ్, అతని ఇద్దరు సహచరులు తనను అపహరించి లాడ్జిలో అత్యాచారం చేశారని ఆరోపిస్తూ మైనర్ జాజ్పూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ఫిర్యాదు మేరకు, ఈ సంఘటనలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పోలీసులు వెంటనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారని ఆయన అన్నారు. ఒక హాకీ కోచ్, ఇద్దరు మాజీ కోచ్లను అరెస్టు చేశాం. వారిలో ఒకరు బాలికపై అత్యాచారం చేశాడని, మిగతా ఇద్దరు అతనికి ఈ నేరంలో సహకరించారని జాజ్పూర్ పోలీసు సూపరింటెండెంట్ యశ్ప్రతాప్ తెలిపారు. నేరంలో అతని ప్రమేయం ఇప్పటివరకు కనుగొనబడకపోవడంతో అదుపులోకి తీసుకున్న మరొక వ్యక్తిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసుపై మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆ బాలిక గత రెండు సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యాలయంలోని జాజ్పూర్ హాకీ స్టేడియంలో శిక్షణ పొందుతోంది.
జూలై 3 సాయంత్రం, బాలిక ఇంటికి వెళుతుండగా, ఆమె కోచ్, అతని ఇద్దరు సహచరులు ఆమెను కిడ్నాప్ చేసి ఒక లాడ్జికి తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తామని నేరానికి పాల్పడిన వ్యక్తులు మైనర్ను బెదిరించారని బాలిక పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్లు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 6 (అత్యాచారం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సోమవారం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారని.. బాధితురాలి వాంగ్మూలాన్ని జిల్లా కోర్టు ముందు నమోదు చేశామని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.