1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (10:22 IST)

పని చేసిన బ్యాంకుకే కన్నం వేసిన ఘనుడు... ఎక్కడ?

తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన డబ్బు కోసం తాను పని చేసిన బ్యాంకుకే కన్నంవేశాడో బ్యాంకు మేనేజరు. ఈ దోపిడీని గుర్తించి అడ్డుకునేందుకు యత్నించిన మహిళా అసిస్టెంట్‌ మేనేజర్‌ను హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా విరార్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అనిల్‌ దూబే అనే వ్యక్తి గురువారం రాత్రి 8-9 గంటల మధ్య తన మిత్రుడితో కలిసి బ్యాంకులోకి వెళ్లాడు. బ్యాంకు పని వేళలు ముగియగా బ్యాంకు షట్టర్లు మూసివేసి.. ఇద్దరు మహిళా ఉద్యోగులు లోపల పని చేసుకుంటున్నారు.
 
నిందితులిద్దరూ అసిస్టెంట్‌ మేనేజర్‌ యోగితా వర్థక్‌, క్యాషియర్‌ శ్రద్ధా దేవరూఖ్కర్‌ను కత్తితో బెదిరించి బ్యాంకులో ఉన్న నగదు, ఆభరణాలు డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత పారిపోయేందుకు యత్నిస్తుండగా.. యోగితా, శ్రద్ధ కేకలు వేశారు. 
 
దీంతో నిందితుడు వారిపై కత్తితో దాడి చేసి అక్కడి పారిపోయాడు. ఈ క్రమంలో వీరి కేకలు విన్న పలువురు స్థానికులు.. పారిపోతున్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అనిల్‌ దూబే వారికి చిక్కగా పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యోగిత, శ్రద్ధను ఆసుపత్రికి తరలించారు.
 
అయితే, దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన యోగిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రద్ధా చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితుడు అనిల్‌ దూబే నైగావ్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఘటన తర్వాత బ్యాంకు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి, అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.