దళిత ఐపీఎస్పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య
హర్యానా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. దళిత ఐపీఎస్కూ కులవివక్ష తప్పలేదు. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేని ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉన్నతోద్యోగంలో ఉన్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మృతుడి భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావడం, వ్యక్తిగత సమస్యలు కూడా లేకపోవడంతో ఐపీఎస్ ఆఫీసర్ పూరణ్ కుమార్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. అయితే, తాజాగా పూరణ్ రాసిన చివరి లేఖ వెలుగులోకి రావడంతో ఈ మిస్టరీ వీడింది. కులం పేరిట వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నట్లు పూరణ్ అందులో పేర్కొన్నారు.
సీనియర్ అధికారులు తనను వేధించిన తీరును వివరిస్తూ పూరణ్ కుమార్ మొత్తం ఎనిమిది పేజీల లేఖ రాశారు. తనను వేధించిన ఉన్నతాధికారుల పేర్లనూ అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ లేఖతో పూరణ్ భార్య, ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నీపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. తన భర్త బలవన్మరణానికి కారణమైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. వీరితో పాటు హర్యానా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 9 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లనూ పూరణ్ తన సూసైడ్ లెటర్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
2020 నుంచే ఈ అధికారులు కుల వివక్షతో తనను వేధిస్తున్నారని పూరణ్ ఆరోపించారు. మానసిక వేధింపులు, బహిరంగ అవమానం, దౌర్జన్యాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఈ వేధింపులు భరించలేని స్థాయికి చేరడంతో కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయాన్ని సందర్శించినందుకు వేధించారని, చావుబతుకుల మధ్య ఉన్న తన తండ్రిని కడసారి చూసుకోవడానికి సెలవు అడిగితే నిరాకరించారని ఆరోపించారు.