1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 జూన్ 2025 (10:52 IST)

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

tentu lakshmi narasimhulu
మావోయిస్టులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు విజయవంతంగా సాగిపోతోంది. ఈ ఆపరేషన్‌లో అనేక మంది మావోయిస్ట్ అగ్రనేతలు నేలకొరిగిపోతున్నారు. తాజాగా మావో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైన, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
భద్రతా దళాలతో జరిగిన ఎన్‌‌కౌంటరులో మరణించారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు హతమైన నెల రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మావోయిస్టు సీనియర్ నాయకులు సమావేశమయ్యారన్న కచ్చితమైన సమాచారంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.
 
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ఎఫ్) దళాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో, గురువారం తెల్లవారుజామున మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో సుధాకర్ మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
కాగా, సుధాకర్... మావోయిస్టు వర్గాల్లో గౌతమ్, ఆనంద్, చంటి బాలకృష్ణ, రామరాజు, సోమన్న వంటి అనేక మారుపేర్లతో సుపరిచితుడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామం. గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న సుధాకర్‌పై ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో కూడా ఆయన పాల్గొన్నారు.
 
బీజాపుర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్‌కౌంటర్ ఘటనను ధృవీకరించారు. అయితే, సుధాకర్ మృతికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం బీజాపుర్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
అదేసమయంలో గత ఆరు నెలల కాలంలో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు కీలక నాయకులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేయడం, మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిగణిస్తున్నారు. మూడు వారాల వ్యవధిలోనే ఇది రెండో పెద్ద ఎదురుదెబ్బ.