1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:24 IST)

మమతా బెనర్జీకి మరో షాక్.. సీనియర్ ఎంపీ ద్వివేదీ రాజీనామా

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి దెబ్బపై దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ గుడ్‌బై చెప్పారు. 
 
టీఎంసీకి చెందిన సీనియర్ ఎంపీ దినేశ్‌ త్రివేది తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన సభలో మాట్లాడుతూ తన రాజీనామాను ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు తానేమీ చేయలేకపోతున్నానని, అందుకే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు త్రివేది తెలిపారు.
 
'బెంగాల్‌లో జరుగుతున్న హింస ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. దాని గురించి ఇక్కడేం మాట్లాడట్లేదు. హింసను అరికట్టేలా నేనేమీ చేయలేకపోతున్నందుకు నాకు చాలా ఇబ్బందిగా, బాధగా ఉంది. నన్ను ఇక్కడికి పంపించినందుకు మా పార్టీకి నేను కృతజ్ఞతగా ఉంటాను. కానీ అక్కడ దాడులు జరుగుతుంటే నేను మౌనంగా కూర్చోలేను. ఏం చేయలేని నువ్వు ఇక్కడ ఎందుకు? అని నా అంతరాత్మ ప్రశ్నిస్తోంది. అందుకే రాజీనామా చేస్తున్నా' అని త్రివేది సభలో ప్రకటించారు. 
 
అయితే రాజీనామాకు ప్రక్రియ ఉంటుందని, దీనిపై ఛైర్మన్‌కు లేఖ రాయాలని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సూచించారు. అనంతరం త్రివేది తన రాజీనామా లేఖను ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి అందించారు. త్రివేది నిర్ణయం తృణమూల్‌ పార్టీని షాక్‌కు గురిచేసింది. ఆయన పదవి నుంచి తప్పుకోవడం బాధాకరమని టీఎంసీ ఎంపీలు వ్యాఖ్యానించారు.
 
మరోవైపు, దినేశ్ త్రివేది కూడా భాజపాలో చేరే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓవైపు భాజపాపై బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. త్రివేది గురువారం తన ట్విటర్‌ ఖాతాలో ప్రధాని పసంగంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.