1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (09:48 IST)

కాలేజీల్లో హెచ్ఐవీ(ఎయిడ్స్) టెస్టులు చేయండి : త్రిపుర సీఎం ఆదేశం

ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ తాజాగా కీలక ఆదేశాలు జారీచేశారు. అవసరమైతే, తప్పనిసరి అనుకుంటే రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో హెచ్.ఐ.వి లేదా ఎయిడ్స్ టెస్టులు చేయాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఇటీవలి కాలంలో త్రిపుర రాజధాని అగర్తలాలో అధిక సంఖ్యలో హెచ్.ఐ.వి కేసులు నమోదవుతున్నాయి. ఈ బాధితుల్లో విద్యార్థులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ ఈ తరహా ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో హెచ్ఐవీ పరీక్షలు చేయాలని, డ్రగ్స్ మూలాలు గుర్తించాలని రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. 
 
ఇటీవలి కాలంలో ఈ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం కూడా పెరిగింది. దీంతో విద్యార్థులు దురాలవాట్లకు బానిసలవుతున్నారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ముఖ్యంగా, సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం వల్ల ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అగ్రర్తలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు కనీసం రెండు మూడు ఎయిడ్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ ఈ తరహా ఆదేశాలు జారీచేశారు.