శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (14:38 IST)

మాంగల్య దోషాన్ని అధికమించేందుకు బాలుడిని పెళ్లాడిన టీచరమ్మ... ఎక్కడ?

సాధారణంగా పలువురు మహిళలకు మాంగల్య దోషం ఉంటుంది. ఇలాంటి దోష నివారణకు కొన్ని రకాల పూజలు చేస్తుంటారు. మరికొందరు రావిచెట్టుతో పెళ్లి జరిపిస్తుంటారు. అయితే, ఈ ట్యూషన్ టీచరమ్మ మాత్రం తన మాంగల్య దోష నివారణ కోసం ఏకంగా 13 యేళ్ల బాలుడుని వివాహం చేసుకుంది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని జంలంధర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాబ్‌లోని జలంధర్‌ పట్టణంలో బస్తీ బవఖేల్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ టీచరుగా పని చేస్తోంది. ఈమెకు జన్మ నక్షత్రం రీత్యా మాంగల్య దోషం ఉందని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. దీన్ని అధిగమించేందుకు కూడా ఉపాయం చెప్పాడు.
 
ఆ పండితుడు చెప్పిన ప్రకారంగా ఆ టీచర్... 13 ఏండ్ల బాలుడిని పెండ్లి చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి కావడంతో పోలీసులు దృష్టిసారించారు. టీచరమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
పండితుడు ఇచ్చిన సలహా మేరకు ఆ మహిళ తన వద్దకు ట్యూషన్‌కొచ్చే పిల్లల్లో ఒకడైన 13 ఏండ్ల బాలుడిని పెండ్లి కొడుకుగా ఎంపిక చేసుకున్నారు. ట్యూషన్ల కోసం వారం రోజుల పాటు బాలుడిని తమ ఇంట్లో ఉంచాలని ఆమె బాధితుడి తల్లితండ్రులను కోరింది. బాలుడు ఇంటికి తిరిగివచ్చి అక్కడ జరిగిన తంతును వివరించడంతో ఈ విషయం వెలుగుచూసింది.
 
బాలుడి తల్లితండ్రులు దీనిపై స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మహిళ కుటుంబ సభ్యులు బలవంతంగా హల్దీ-మెహందీ వేడుకలను నిర్వహించడంతో పాటు శోభనం జరిపారని ఆపై టీచర్‌ గాజులను పగులగొట్టి ఆమెను విధవగా ప్రకటించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలుడి తల్లితండ్రులు తెలిపారు. 
 
ఈ తంతు ముగించేందుకు మహిళ కుటుంబ సభ్యులు సంతాప సమావేశాన్ని కూడా నిర్వహించారు. మరోవైపు బాలుడి తల్లితండ్రులను మహిళ కుటుంబ సభ్యులు బలవంతంగా ఫిర్యాదును వెనక్కితీసుకునేలా చేశారు. ఫిర్యాదుదారు తన కేసును ఉపసంహరించారని స్ధానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ గగన్‌దీప్‌ సింగ్‌ సెఖాన్‌ నిర్ధారించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.