1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (17:34 IST)

ఢిల్లీలో పల్స్ పోలియాను ప్రారంభించిన కేంద్ర మంత్రి

పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డేను పురస్కరించుకుని ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోభాగంగా, ఐదేళ్ళలోపు చిన్నారులకు కేంద్ర మంత్రి పోలియో చుక్కలు వేశారు. అలాగే, ఐదేళ్ళలోపు ప్రతి ఒక్క చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. 
 
ఇదిలావుంటే, పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఈ నెల27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 
 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రయాణ ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, బస్టు స్టేషన్లు, విహార కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు, మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలను గుర్తించి ఈ పోలియో చుక్కలు వేస్తారు. 
 
ఈ నెల 27న గ్రామాలు, పట్టణాల్లో పోలియో చుక్కలు వేస్తారు. మొదటి రోజు వేసుకోనివారికి 28వ తేదీన చుక్కలు వేస్తారు. మార్చి ఒకటో తేదీన వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టి పోలియో చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వారికి పోలియో డ్రాప్స్ వేసేలా చర్యలు తీసుకోనున్నారు.