గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (11:33 IST)

కేంద్రం కీలక నిర్ణయం... ఇకపై మంత్రులంతా కార్యాలయాల నుంచే విధులు

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లోభాగంగానే దీన్ని అమలు చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వారిలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే, సోమవారం నుంచి కేంద్రమంత్రులంతా తమతమ కార్యాలయాల్లో విధులకు హాజరుకానున్నారు. 
 
కేంద్ర మంత్రులందరూ సోమవారం నుంచి తమ తమ మంత్రిత్వ శాఖలకు వచ్చి విధులు నిర్వర్తించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత జరగాల్సిన పనులు, ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడం... తదితర అవసరాల దృష్ట్యా కేంద్ర మంత్రులందరూ సోమవారం నుంచి తమ తమ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించాలని కోరినట్లు సమాచారం. 
 
ఇప్పటికే అన్ని శాఖల జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులకు ఈ ఉత్తర్వులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రులు గనుక తమ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తే 1/3 వంతు ఉద్యోగులు కూడా వారి సహాయార్థం విధులకు రావాల్సి ఉంటుందని ఓ అంచనా. 'ప్రభుత్వం అందిస్తున్న రవాణా సదుపాయం ఉన్న జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులందరూ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించాలి' అని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
 
ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తికాకుండా తీసుకోవాల్సిన చర్యలను సమీక్షిస్తూనే, మరో వైపు లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఆర్థిక రంగం పరుగులు పెట్టే విధంగా ఇప్పటి నుంచే కేంద్ర మంత్రులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే సోమవారం నుంచి కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీ చేశారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
 
నిజానికి ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ అత్యంత కీలక శాఖలు నిర్వహిస్తున్న హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి తోమర్‌లు ప్రతిరోజూ తమతమ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.