గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (20:12 IST)

ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడగింపు : అన్‌లాక్ 3.O మార్గదర్శకాలు ఇవే...

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే 14 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ బారినపడిన అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్ 2 ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్‌లాక్ 3కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం హోంశాఖ బుధవారం ప్రకటించింది. ఇందులోభాగంగా, కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31వ తేదీ వరకు లాక్డౌన్‌ను పొడగించింది. పైగా, ఈ జోన్లలో లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 
 
అయితే.. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్-3 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం కొంత ఊరట లభించే విధంగా సడలింపులను ప్రకటించింది. రాత్రి వేళ్లలో ఇప్పటివరకూ విధిస్తున్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 5వ తేదీ నుంచి యోగా ఇన్‌స్టిట్యూట్స్‌, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది. అయితే.. కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 
 
పంద్రాగస్టు వేడుకలకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. భౌతిక దూరంతో పాటు ఇతర హెల్త్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని స్పష్టం చేసింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకూ మూసే ఉంటాయని తెలిపింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు పరిమిత సంఖ్యలో అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది. 
 
అయితే.. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లకు, సినిమా హాల్స్‌కు, స్విమ్మింగ్ పూల్స్‌కు, పార్కులకు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సభలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఈ పైన పేర్కొన్న వాటిలో పరిస్థితిని అంచనా వేసి దశలవారీగా అనుమతినివ్వనున్నట్లు కేంద్రం హోంశాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.