వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్
సాధారణంగా పెళ్లి వేడుకలు ఒక్కో రాష్ట్రం లేదా ఒక్కో తెగలో ఒక్కో రకమైన సంప్రదాయబద్ధంగా జరుగుతుంటాయి. ఇలాంటి సంప్రదాయాల్లో ఒకటి చెప్పులుదాచిపెట్టడం. దీన్ని 'జూతా చూపాయి' అని కూడా పిలుస్తారు. తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడు బూట్లను వధువు వదిన దాచిపెట్టింది. వాటిని తిరిగి ఇచ్చేందుకు వరుడు నుంచి రూ.50 వేలు డిమాండ్ చేయగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. ఇంత తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తారా అంటూ వరుడు కుటుంబ సభ్యులపై వధువు కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చక్రటకు చెందిన వరుడు మహ్మద్ షాబిర్ ఊరేగింపుగా యూపీలోని బిజ్నోర్కు వచ్చాడు. వారి వివాహ ఆచారంలో భాగంగా, వధువు వదిన వరుడు షాబిర్ బూట్లను దొంగిలించింది. ఆ తర్వాత వాటిని తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్ చేయగా వరుడు మాత్రం రూ.5 వేలు ఇచ్చి సరిపెట్టుకున్నాడు. దీంతో వరుడుని బిచ్చగాడిగా అభివర్ణించారు. ఇది గొడవకు దారితీసింది. వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వరుడు కుటుంబ సభ్యులను వధువు కుటుంబ సభ్యులు ఓ గదిలో బంధించిన కర్రలతో చితకబాదారు.
అయితే, వధువు కుటుంబ సభ్యులు మాత్రం మరోలా చెబుతున్నారు. పెళ్లి కొడుకుకు పెట్టిన బంగారం నాణ్యతను ప్రశ్నించడంతో ఈ గొడవ మొదలైందని చెప్పారు. వారికి తమ కుమార్తె కంటే డబ్బులే ఎక్కువైపోయాయని ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారిని శాంతపరిచారు. అయితే, పోలీసులు మాత్రం ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు.