1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (12:29 IST)

ఉత్తరాఖండ్‌లో వర్షాలకు 45 మంది మృతి : నేడు అమిత్ షా పర్యటన

ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 40 మంది చనిపోయారు. ఒక్క నైనిటాల్‌లోనే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలతో పాటు పలు చోట్ల కొండ చరియలు విరిగిపడడంతో ఇళ్లు నేల మట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. 
 
కుమావ్ ప్రాంతంపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ దామి ఏరియల్ సర్వే నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 
 
ఇళ్లు కోల్పోయిన వారికి లక్షా 90 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. వెంటనే పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లు రంగంలోకి దించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 
 
భారీ వర్షాలకు నైనిటాల్ ఆగమైంది. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. నైనా దేవి టెంపుల్, మాల్ రోడ్డును వరదలు ముంచెత్తాయి. కోసి నది ఉప్పొంగి ప్రవహించడంతో రామ్ నగర్ - రాణికేత్ మార్గంలో లెమన్ ట్రీ రిసార్టులో వంద మంది చిక్కుకుపోగా.. వారిని  సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 
 
ఛార్‌ధామ్ యాత్రకు వచ్చిన వంద మంది గుజరాత్ యాత్రికులు ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయారు. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం పుష్కర్ సింగ్ దామికి ఫోన్ చేసి ఆరా తీశారు ప్రధాని, కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు. 
 
ఉత్తరాఖండ్‌లోని వరదలు, అందుతున్న సాయంపై పరిశీలించేందుకు బుధవారం అమిత్‌ షా వెళ్లనున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు బ్లాక్‌ అయ్యాయి. మరికొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇప్పటికే కొండ చరియలు విరిగిపడి శిథిలాల కింద చిక్కుకున్న 42 మందిని కాపాడారు. 
 
ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ దమానీ వరద నష్టాన్ని మంగళవారం ఏరియల్‌ సర్వే ద్వారా అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పుష్కర్‌ సింగ్‌ ఫోన్‌లో మాట్లాడి సహాయాన్ని అడిగారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సహయక చర్యలను ముమ్మరం చేసింది.