శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 మే 2020 (17:30 IST)

కన్నీరు పెట్టిస్తున్న దృశ్యం - గర్భిణీతో తోపుడు బల్లపై 700 కిమీ...

ఆ దృశ్యం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటారు. లక్డౌన్ వల్ల వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ కావడంతో ఆయా ప్రాంతాల్లో చిక్కుకుని పోయిన వలస కార్మికులు, కూలీలు తమ సొంతూళ్ళకు వెళ్లేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా, వారు అష్టకష్టాలు పడుతున్నారు. 
 
తాజాగా ఓ భర్త నిండు గర్భిణి అయిన తన భార్యను తీసుకుని ఏకంగా 700 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాడు. అయితే, గర్భిణి అయిన భార్య, మరో బిడ్డను మాత్రం తోపుడు బల్లపై కూర్చోబెట్టుకుని, దాన్ని లాక్కొంటూ గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఆ వలస కూలీ దీనగాథ వింటే ప్రతి ఒక్కరూ కన్నీరుపెట్టక మానరు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వలసకూలీ హైదరాబాద్‌లో నివసిస్తూ.. నిండు గర్భిణి అయిన తన భార్య, రెండేళ్ల పాపతో కలిసి స్వస్థలానికి బయలుదేరాడు. బాలాకోట్‌కు చెందిన రాము, తన భార్య ధన్వంత (8 నెలల గర్భిణి), రెండేళ్ల కూతురు అనురాగిణితో స్వస్థలానికి పయనమయ్యాడు. 
 
అంతదూరం తన భార్య నడిచివెళ్లాలంటే ప్రమాదమని భావించి మార్గమధ్యలో చేతికి దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేశాడు. దానిపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టిన రాము వందల కిలోమీటర్లు వారిని తీసుకెళ్లాడు. 
 
తినడానికి తిండి లేకున్నా అలాగే తన ప్రయాణం కొనసాగించాడు. రోడ్డున పోయే ఒకరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.