1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (12:21 IST)

భార్యకు మధ్యవర్తిగా ఉన్నాడనీ... స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి...

murder
తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండేందుకు సహకరిస్తున్నాడన్న అనుమానంతో తన స్నేహితుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్టణంలోని రామా టాకీస్ దరి శ్రీనగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖ రామా టాకీస్ దరి శ్రీనగర్‌కు చెందిన డింగు శివకుమార్ ఆలియాస్ శివారెడ్డికి రెల్లివీధికి చెందిన కిరణ్ ద్వారా సీతంపేటకు చెందిన కలిశెట్టి కిశోర్ (26)తో స్నేహం ఏర్పడింది. కిశోర్ ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. 
 
అయితే, శివారెడ్డి మద్యం, గంజాయి తాగి ఇంటికి రావటంతో భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఎంత చెప్పినా ప్రవర్తన మారకపోవడంతో విసుగు చెందిన భార్య కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కిశోర్... తన భార్య మరో స్నేహితుడు ఉదయ్‌‌తో సన్నిహితంగా ఉంటుందని, దీనికి కిషోర్ సహకరిస్తున్నట్టుగా శివారెడ్డి భావించాడు. దీంతో కిషోర్‌ను అంతం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగేందుకు శ్రీనగర్‌‌లోని తన అపార్టుమెంటుకు రావాలని పిలవడంతో దేవా, కిరణ్‌తో కలిసి కిశోర్ అక్కడికి వెళ్లాడు. వీరంతా కలిసి మద్యం తాగుతుండగా.. కిశోశ్‌ను శివారెడ్డి పక్కకు తీసుకెళ్లి.. మూడంతస్తుల భవనం నుంచి కిందికి తోసేసి పారిపోయాడు. ఒక్కసారిగా పెద్ద శిబ్దం రావడంతో మిగిలిన ఇద్దరూ కిందకి చూడగా కిశోర్ తీవ్ర రక్తపు మడుగులో కనిపించాడు. ఆ వెంటనే కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.