1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (08:48 IST)

సిగరెట్ కోసం గొడవ.. గంజాయి మత్తులో స్నేహితుడిని చంపేశారు..

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తుందని విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇవి నిజమని రుజువు చేసేలా యువత గంజాయి మత్తులో అనేక నేరాలు ఘోరాలకు పాల్పడుతుంది. తాజాగా సిగరెట్ కోసం సాగిన వివాదంలో ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హత్య చేశారు. ఈ దారణం ఘటన విశాఖపట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ ఏవీఎస్ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కుమారుడు చిన్నాతో (17) కలిసి నివసిస్తోంది. అయితే, పాతనగరంలోని విస్కీ అనే రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకున్న చిన్నా చివరకు వ్యసనాలకు బానిసయ్యాడు.
 
ఈ నెల 20వ తేదీన స్నేహితులతో కలిసి అతడు చవితి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఆ మరుసటి రోజు అర్థరాత్రి దాటాక మరో నలుగురు స్నేహితులతో కలిసి సిగరెట్లు తాగాడు. ఈ క్రమంలో వారి మధ్య సిగరెట్ కోసం గొడవ మొదలైంది. చివరకు స్నేహితులే చిన్నా గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి దాచారు.
 
మరుసటి రోజు తెల్లవారుజామున వినాయకచవితి సామాగ్రి తరలించడం కోసం ఓ ఆటో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే చిన్నా మృతదేహాన్ని కూడా ఆటోలో చేపల చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ సముద్రంలో విసిరేశారు. చిన్నా మృతదేహం పోలీసులకు లభించడంతో వారు ఆటోడ్రైవర్‌ను వెతికిపట్టుకుని విచారించారు. దీంతో, అతడు జరిగిందంతా చెప్పడంతో పోలీసులు చిన్నాను చంపిన నలుగురు టీనేజర్లను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.