శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (20:23 IST)

భర్తను దోసెతో చంపేసిన భార్య.. ఎలాగంటే?

వారిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఒకరినొకరు అన్యోన్యంగా ఉన్నారు. వీరికి కొడుకు కూడా పుట్టాడు. అయితే భర్త ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి రావడం.. ఇంట్లో గొడవ పడటం షరా మామూలుగా మారిపోయింది. ఓపిక నశించిపోయిన భార్య పక్కా స్కెచ్‌తో భర్తను చంపేసింది. అది కూడా దోసె పిండిలో నిద్ర మాత్రలు కలిపి తినిపించి చంపేసింది. తమిళనాడులోని టీనగర్‌లో ఘటన చోటుచేసుకుంది.
 
చెన్నై సమీపంలోని పుళల్ బుద్థగరం వెంకటేష్ నగర్‌లో నివాసముండే సురేష్ స్థానికంగా మాంసం షాపులో పనిచేసేవాడు. అనసూయతో ఇతనికి రెండేళ్ళ క్రితం వివాహమైంది. వీరి జీవితం బాగానే ఉండేది. అయితే మద్యానికి అలవాటు పడిన సురేష్ ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు.
 
ఇంట్లో అవసరానికి ఎలాంటి డబ్బులు ఇచ్చేవాడు కాదు. అన్నింటిని తాగడానికే ఖర్చు చేసేవాడు. ఇదంతా భరిస్తూ వచ్చింది అనసూయ. అయితే పక్కింటి కుర్రాడుతో అనసూయ అక్రమ సంబంధం పెట్టుకుందని కావాలనే సురేష్ ప్రచారం చేస్తూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు.
 
దీనితో ఎలాగైనా భర్తను చంపేయాలనుకున్న అనసూయ దోసె పిండిలో నిద్రమాత్రలు వేసింది. ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన సురేష్‌కు దోసెలు వేసి ఇచ్చింది. దీన్ని తిన్న సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నిద్రిస్తున్న అతని ముఖంపై దిండుతో గట్టిగా గాలి ఆడకుండా చేసి చంపేసింది. మొదట్లో తన భర్త గుండెపోటుతో చనిపోయాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసినా పోస్టుమార్టంలో బాగోతం బయటపడటంతో అసలు నిజాన్ని ఒప్పేసుకుంది అనసూయ.