యాకూబ్ ఉరి : ఆ ముగ్గురికి భద్రత పెంచారు...! ఏ ముగ్గురికి..?
యాకూబ్ ఉరి తరువాత ఆ ముగ్గురు జడ్జీలకు భద్రత పెరిగింది. నిఘా సంస్థలు హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం యాకూబ్ క్యూరేటివ్ పిటీషన్ను తిరస్కరించిన ముగ్గురు న్యాయమూర్తులకు భద్రతను పెంచారు.
ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను గురువారం తెల్లవారుజాము వరకూ విచారించిన ధర్మాసనంలో ముగ్గురు జడ్జీలు ఉన్నారు. వారు యాకూబ్ తరపు పిటీషన్ను తిరస్కరించారు. దీని దరిమిళా నిఘా సంస్థల నుంచి అందిన సమాచారాన్ని బట్టి న్యాయమూర్తులకు భద్రతను పెంచినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
1993 నాటి వరుస బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోవడానికి, 700 మంది గాయపడటానికి కారకుడైన యాకుబ్ మెమన్ను ఉరితీసే ముందురోజు ఈ పిటీషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించింది. ఆ తర్వాతే రాష్ట్రపతి యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు. ఆ తర్వాత నేటి ఉదయం యాకుబ్ను ఉరితీశారు. భద్రతా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ముగ్గురు న్యాయమూర్తుల నివాసాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.