1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 1 మార్చి 2022 (14:27 IST)

మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో లింగోద్భవ దర్శన భాగ్యం

ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు ముక్కంటీశ్వరున్ని దర్శించుకుంటున్నారు. శివనామస్మరణలతో శ్రీకాళహస్తి మారుమ్రోగుతోంది.

 
వాయులింగ క్షేత్రాల్లో శ్రీకాళహస్తి అతి ముఖ్యమైనది. ప్రతియేటా మహాశివరాత్రి నాడు వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తికి తరలివస్తుంటారు. కరోనా కారణంగా గత ఏడాది ఏకాంతంగానే సేవలు నిర్వహిస్తే ఈ యేడాది స్వామివారి సేవలో సేవలన్నింటినీ భక్తులు తిలకించే అవకాశాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం కల్పించింది.

 
తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఉచితంగా అల్పాహారాన్ని శ్రీకాళహస్తి సిబ్బంది అందజేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఏడు గంటల లోగా స్వామి వారిని కేవలం అరగంటలో గాని భక్తులు దర్శించుకున్నారు. అయితే ఏడు గంటల తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

 
దీంతో రెండు నుంచి మూడు గంటల సమయం భక్తులకు పడుతోంది. మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయాన్ని అందంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత లింగోద్భవ దర్శనం భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు.