1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:18 IST)

తితిదే పాలకమండలి సభ్యుల కోసం రికమండేషన్లు

ఎపిలో నామినేటెడ్ పదవులకు సంబంధించిన రెకమెండేషన్లు ముగిశాయి. ఇప్పుడు మిగిలింది టిటిడి పాలకమండలి మాత్రమే. టిటిడి పాలకమండలిలో సభ్యులు అంటే సాధారణమైన విషయం కాదు. కేబినెట్ హోదాతో సమానంగా అందరూ భావిస్తారు. భావించడం ఒక్కటే కాదు ఆ పదవి అలాంటిది మరి. 
 
టిటిడి పాలకమండలి సభ్యులను పెంచే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రభుత్వమే చెప్పింది. అనుకున్నట్లుగానే ఈసారి జంబో పాలకమండలి కన్నా ఎక్కువగా సభ్యుల నియామకం ఉండే అవకాశం ఉంది. 
 
అయితే గతంలోనే జంబో పాలకమండలి అంటూ ప్రచారం జరగడం.. ప్రభుత్వం ఇరకాటంలో పడడంతో వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా పాలకమండలి సభ్యులను పెంచాలంటే మంత్రిమండలిలో చట్టసవరణ అవసరం. దీంతో ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే 24 మందితో పాలకమండలి ఉండేదో అదేవిధంగా ఈసారి కూడా నియమించాలన్న ఆలోచనలో ఉందట.
 
ఇప్పటికే దీనికి సంబంధించిన పేర్లను కూడా పరిశీలించి వారినే ప్రకటించబోతున్నారట. తెలంగాణా నుంచి ఐదుగురికి, అందులో ఒకరు ఎమ్మెల్యే, అలాగే తమిళనాడు నుంచి ఒక ఎమ్మెల్యే, ఇక ప్రత్యేక ఆహ్వానితులు కూడా చాలామందే ఉన్నారు. 
 
అయితే గత 15 రోజుల నుంచే సిఎం కార్యాలయానికి బోర్డు సభ్యునిగా నియమించాలంటూ వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉందట. దీంతో సిఎం ఏంటయ్యా ఇది.. ఆ పోస్టుకు ఇంతమంది వస్తున్నారేంటి. తక్కువమందినే తీసుకోవాలనుకుంటున్నాం.. మరి ఎందుకు ఇంతమంది వస్తున్నారంటూ ప్రశ్నించారట.
 
మొత్తంమీద అధికారిక ప్రకటన ఈరోజో, రేపోనన్న ప్రచారం సాగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎంత త్వరగా పేర్లను ప్రకటిస్తే అంతమంచిదన్న నిర్ణయానికి వచ్చిందట. లేకుంటే ఇంకా ఎక్కువమంది రెకమెండేషన్ చేస్తారేమోనని ముఖ్య నేతలంతా సిఎంను తొందరపెడుతున్నారట. ఈ నెల 19వ తేదీన పాలకమండలి సమావేశం జరుగనుండడంతో సమావేశంలో పాలకమండలి సభ్యుల సంఖ్యపై తీర్మానం చేయవచ్చన్న ప్రచారం సాగుతోంది.