1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (18:55 IST)

సానియా మీర్జా సంచలనం.. ఖాతాలో 43వ డబుల్స్‌ టైటిల్‌

sania mirza
భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఒస్ట్రావా ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)-500 టోర్నీలో చైనా భాగస్వామి షుయె జాంగ్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్‌ సానియా-ష్వై జాంగ్‌ ద్వయం 6-2, 6-2తో మూడో సీడ్‌ కైట్లిన్‌ క్రిస్టియన్‌ (అమెరికా)-ఎరిన్‌ రౌట్లిఫ్‌ (న్యూజిలాండ్‌) జంటపై విజయం సాధించింది.
 
ఛాంపియన్‌గా నిలిచిన సానియా-షుయె జాంగ్‌ జోడీకి 25,230 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో 34 ఏళ్ల సానియా తన కెరీర్‌లో 43వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది. చివరిసారి 2020 జనవరిలో హోబర్ట్‌ ఓపెన్‌లో నాదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి టైటిల్‌ నెగ్గిన సానియా ఖాతాలో చేరిన మరో డబుల్స్‌ టైటిల్‌ ఇదే కావడం విశేషం.