బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (14:29 IST)

కరోనా దెబ్బకు కకావికలం : యూరప్‌లో ఫుట్‌బాల్ కోచ్ మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బాధిత దేశాల్లో యూరప్ ఒకటి. చైనా, ఇటలీ, స్పెయిన్ తర్వాత అధిక ప్రభావం కలిగిన దేశం. ఈ కరోనా వైరస్ యూరప్‌ను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇటలీలో ఇప్పటికే 2158 మంది మృత్యువాతపడ్డారు. స్పెయిన్‌లో 335  మంది చనిపోయారు. 
 
తాజాగా యూరప్‌లో స్పానిష్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ ఫ్రాన్సికో గార్సియా ప్రాణాలు కోల్పోయారు. ఈయన కరోనా వైరస్ కారణంగానే చనిపోయినట్టు తెలుస్తోంది. ఈయన వయసు కేవలం 21 యేళ్లు కావడం ఇపుడు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో  లుకేమియాతో పోరాడుతూ మృతిచెందిన వ్యక్తిగా ఫ్రాన్సికో నిలిచాడు. 
 
ఇప్పటికే లుకేమియాతో బాధపడుతున్న ఫ్రాన్సికోలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మలాగా ప్రాంతంలో కరోనా కారణంగా మరణించిన ఐదో వ్యక్తి గార్సియా కాగా.. మిగతా వారందరి వయసు 70-80 ఏండ్లుగా ఉంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్‌ను 2 వారాల పాటు వాయిదా వేశారు. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 9,407 కేసులు నమోదు కాగా.. 335 మంది మృతి చెందారు. 
 
యూరప్‌లో ఇప్పటి వరకు 55 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా తర్వాత అత్యంత ఎక్కువగా ప్రభావితమైంది యూరప్‌ దేశాలే. ఇప్పటికే ఆయా దేశాలన్నీ సరిహద్దులను మూసివేసి.. పలు దేశాలకు ప్రయాణాలను నిషేధించాయి.