1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (17:55 IST)

జావెలిన్ త్రోలో బంగారం : చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త చరిత్రను లిఖించాడు. అథ్లెటిక్స్‌లో దేశానికి బంగారు పతకం అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా సూప‌ర్ షో క‌న‌బ‌రిచి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్య‌ధికంగా 87.58 మీట‌ర్ల దూరం విసిరి అందరికంటే అగ్రపథాన నిలిచాడు. ఫలితంగా అథ్లెటిక్స్‌లో నీర‌జ్ బంగారు ప‌త‌కాన్ని అందించి ఇండియాకు చిరస్మ‌ర‌ణీయ రోజును మిగిల్చాడు.
 
తొలి ప్ర‌య‌త్నంలో అత‌ను 87.03 మీట‌ర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక రెండో అటెంప్ట్‌లో అత‌ను మ‌రింత ప‌దునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్‌లో 87.58 మీట‌ర్ల దూరం విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరాడు. 
 
నిజానికి క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో ఫ‌స్ట్ త్రోతోనే అంద‌రికీ షాకిచ్చాడు. అత‌ని ప‌ర్స‌న‌ల్ బెస్ట్ 88.07 మీట‌ర్లు. దానికి త‌గిన‌ట్లే నీర‌జ్ టోక్యోలో త‌న ప్రతిభను చూపించాడు. ముందు నుంచి ఫెవ‌రేట్‌గా ఉన్న నీర‌జ్‌.. అనుకున్న‌ట్లే దేశానికి బంగారు పతకం అందించాడు. 
 
ఇకపోతే, శనివారం జరిగిన ప్ర‌తి అటెంప్ట్‌లోనూ నీర‌జ్ నిప్పులు చెరిగే రీతిలో జావెలిన్ త్రో చేశాడు. ప్ర‌తి త్రోలోనూ అత‌ను మ‌రింత మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. ఆరంభం నుంచి లీడింగ్‌లో ఉన్న చోప్రా.. ఇండియాకు అథ్లెటిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని అందించాడు. వ‌ద్‌లేచ్ జాకుబ్ 86.67 మీట‌ర్లు, వెస్లీ వెటిస్లేవ్ ల85.44 మీట‌ర్ల దూరం విసిరి సిల్వ‌ర్, బ్రాంజ్ మెడ‌ల్స్ అందుకున్నారు.