లండన్ క్లాసిక్ టైటిల్.... ఆనంద్ కైవసం..!
భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సోమవారం జరిగిన లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఛాంపియన్ షిప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో చివరి రౌండ్లో బ్రిటిష్ గ్రాండ్మాస్టర్ మైకేల్ ఆడమ్స్పై ఆనంద్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.
ఆరుగురు క్రీడాకారులు పోటీపడ్డ ఈ రౌండ్రాబిన్ టోర్నీలో తొలి నాలుగుగేమ్లు డ్రాగా ముగించిన ఆనంద్, ఆఖరిరౌండ్లో విజయంతో మొత్తం ఏడు పాయింట్లు సాధించాడు.
దీంతో మరో ఇద్దరు ఆటగాళ్లు అనిష్ గిరి (నెదర్లాండ్స్), క్రామ్నిక్ (రష్యా)లతో కలిసి సంయుక్తంగా 7పాయింట్లతో సమంగా నిలిచిన ఆనంద్.. సూపర్ టైబ్రేక్లో విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆనంద్కిది కెరీర్లో తొలి లండన్ క్లాసిక్ టైటిల్ కావడం విశేషం.